మంచిర్యాల జిల్లా.
సింగరేణి కార్మికులకు 819 కోట్ల రూపాయల బోనస్.
దసరా పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకు వరుసగా రెండో ఏడాది ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. సింగరేణి సంస్థ గత ఏడాది సాధించిన విజయాలు, లాభాల ఆధారంగా కార్మికులకు 34 శాతం మేరకు బోనస్ ప్రకటించారు. మొత్తం రూ.819 కోట్ల రూపాయల బోనస్ ప్రకటించడంతో దాదాపు 71 వేల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ – “సింగరేణి సంస్థ నష్టాల్లో ఉన్న సమయంలో కేంద్రంతో చర్చించి సంస్థను కాపాడినది కాకా వెంకటస్వామి కృషి. ఆయన త్యాగం వల్లే ఈరోజు సింగరేణి దేశానికి వెలుగులు ఇస్తోంది” అని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమానికి, హక్కుల పరిరక్షణకు బోనస్ నిర్ణయం ఒక చారిత్రాత్మక అడుగు అని ఆయన పేర్కొన్నారు. “సింగరేణి కార్మికుల శ్రమతోనే రాష్ట్రం, దేశం నిలబడుతున్నాయి. వారి త్యాగానికి గౌరవంగా లాభాల్లో వాటా పంచడం పండుగ శుభవార్త” అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో పాటు ప్రజాప్రతినిధులు, సిఎండి బలరాం నాయక్ మరియు సింగరేణి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.





