రామగుండం పోలీస్ కమీషనరేట్
మహిళా, ప్రజా భద్రత… మా పోలీస్ బాధ్యత.
బతుకమ్మ, దుర్గామాత నవరాత్రి వేడుకలకు ముందస్తు భద్రతా ఏర్పాట్లు పూర్తి : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల్ జోన్ ల పరిధిలో రామగుండం పోలీస్ శాఖ మహిళలు బతుకమ్మ ఆడేటువంటి ప్రాంతాల్లో, దుర్గామాత అమ్మవారు ఏర్పాటు చేసిన ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, పెట్రోలింగ్, విషబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. మహిళలపై వేధింపులు, ఈవ్టీజింగ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి ఆటంకాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటం మహిళ రక్షణ పోలీసుల బాధ్యత. పోలీసులు ప్రత్యేకంగా నిఘా, పర్యవేక్షణ నిర్వహించడంతో పాటు, ప్రజల భద్రతకు సంబంధించిన సమస్యలపై అవగాహన కల్పిస్తాం అన్నారు. ముఖ్యంగా సాయంత్రం పూట బతుకమ్మలు ఆడే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిఘా పెట్టి, ప్రజలకు, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలకు ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు, పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ, విజిబుల్ గా ఉంటూ వెంటనే స్పందించి సహాయం అందిస్తారు. బతుకమ్మ పండుగ సంబరాల సమయంలో మహిళల, ప్రజల భద్రతను పర్యవేక్షించడం పోలీసుల ప్రధాన బాధ్యత, ప్రజలు సురక్షితంగా పండుగను ఆనందించేలా చూడటానికి పోలీస్ కృషి చేస్తుందని తెలిపారు.
దుర్గామాత నవరాత్రి వేడుకలను రామగుండం కమీషనరేట్ వ్యాప్తంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించడం కోసం అన్ని ముందస్తు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయబడ్డాయని సీపీ అన్నారు. దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో నిర్వాహకులు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. వేడుకల సమయంలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే, కఠినమైన చర్యలు తీసుకోవబడతాయని హెచ్చరించారు.ఏమైనా సమస్యలు గమనించిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లేదా డయాల్ 100 ద్వారా సమాచారం అందించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, వదంతులను నమ్మవద్దన్నారు. పండగ ఉత్సవాలను సురక్షితంగా జరుపుకోవడంలో పోలీస్ అధికారులకు సహకరించండి. ప్రజల సహకారంతో ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీస్ నిఘా కొనసాగుతుందని కమిషనర్ తెలిపారు.
పండుగ సెలవులను పురస్కరించుకొని సొంత ప్రాంతాలకు, బంధువుల ఇండ్లకి, విహార యాత్రలకు వెళ్లే ఆయా గ్రామాల, కాలనీ ల ప్రజలు తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరి స్థానిక పోలీస్టేషన్ లో సమాచారం ఇవ్వండి. వారి వివరాలు నమోదు చేసుకొని వారి ఇళ్లపై నిఘా ఏర్పాటు చేస్తాం అన్నారు. అదేవిదంగా మీ గ్రామం, పట్టణం, కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసు స్టేషన్ కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వండి. డయల్ 100కు కాల్ చేసి సమాచారం అందించాలని సీపీ సూచించారు.





