రాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి11
మండలాల పరిధిలో పెండింగ్ లో ఉన్న రెవెన్యూ దరఖాస్తులను సంబంధిత తహశీల్దార్లు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్ నుండి మండల తహశీల్దార్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ధరణి, కోర్టు కేసుల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. ఎస్సీ విద్యార్థులకు ప్రీమెట్రిక్ స్కాలర్ షిప్ కు సంబంధించి వారికి కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే మంజూరు చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. ధృవీకరణలు పొందిన విద్యార్థులకు స్కాలర్ షిప్పుల మంజూరుకు ఆన్లైన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, వేములవాడ ఆర్డీఓ వి. లీల, ఎస్సీ సంక్షేమ అధికారి భాస్కర్ రెడ్డి, సిరిసిల్ల తహశీల్దార్ విజయ్ కుమార్, పర్యవేక్షకులు రవికాంత్, సుజాత, తదితరులు పాల్గొన్నారు.
