*కోనరావుపేట, వీర్నపల్లి, ఎల్లారెడ్డి పేట, గంభీరావుపేట
మండలాల్లో ఆకస్మిక తనిఖీ
కోనరావుపేట/వీర్నపల్లి/ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట, జనవరి -19
వ్యవసాయ యోగ్యం కాని భూములను క్షేత్ర స్థాయిలో గుర్తించి తొలగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ కోసం కోనరావుపేట మండలం మర్రిమడ్ల, వీర్నపల్లి, ఎల్లారెడ్డి పేట మండలాల, గంభీరావుపేట మండలం నర్మాల, గోరంటాలలో సర్వే కొనసాగు తుండగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆయా గ్రామాల్లో సర్వే కొనసాగుతుండగా కలెక్టర్ రికార్డ్స్ పరిశీలించారు. రైతు భరోసా పథకం సాగు చేసే రైతులందరికీ అందుతుందని స్పష్టం చేశారు. వ్యవసాయ యోగ్యంకాని భూములను తొలగించాలని సూచించారు. రేషన్ కార్డుల కోసం పలువురు ప్రజలు కలెక్టర్ ను కోరగా, త్వరలోనే ఇస్తామని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని, ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు.
*విద్యాలయం ఆకస్మిక తనిఖీ*
మర్రిమడ్ల లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల తరగతి గదులు, హాస్టల్ భవనం, డైనింగ్ హాల్, కిచెన్, స్టోర్ రూమ్ పరిసరాలు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కామన్ మెనూ అమలు పై ఆరా తీశారు. ప్రహరీ పూర్తిగా నిర్మించాలని, బోర్వెల్ వేయించాలని కలెక్టర్ కు ఆ విద్యాలయం ప్రిన్సిపాల్ విజ్ఞప్తి చేశారు. ప్రహరీ, బోర్వెల్ ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని కోనరావుపేట ఎంపీడీవో ను కలెక్టర్ ఆదేశించారు.
కార్యక్రమాల్లో మండల ప్రత్యేక అధికారి జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాందాస్, తహసిల్దార్లు, ఎంపీడీవోలు విజయ్ ప్రకాష్ రావు, మారుతిరెడ్డి, రామ్ చందర్, భూపతి, శంకర్ రెడ్డి, వాజిద్, సత్తయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.





