మంచిర్యాలలో అసెంబ్లీ ఎన్నికల్లో అలజడలు, శాంతి భద్రతల కు భంగం కలిగించడానికి బీఆరెఎస్ అభ్యర్థి నడిపెళ్లి దివాకర్ రావు కుట్ర పన్నారని కాంగ్రెస్ అభ్యర్ధి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు.గురువారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రేమ్ సాగర్ రావు మాట్లాడారు.
హైదరాబాద్ లోని కాప్రా లో భూ వివాదం కోర్టులో కొనసాగుతోందని తెలిపారు. కోర్టులో ఓడిపోయిన, కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులను మంచిర్యాల కు తీసుకువచ్చి ఆత్మహత్య యత్నం చేసి ప్రజల్లో తప్పుడు సంకేతాలు తీసుకువెళ్లి ఎన్నికల్లో ఓడించాలనే నీచమైన కుట్రకు తెరతీసారని ధ్వజమెత్తారు. బీఆరెస్ కుట్రల గురుంచి జిల్లా, రాష్ట్ర, ఎన్నికల ప్రధాన అధికారులు, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత న్యాయవాది ద్వారా కేంద్ర ఎన్నికల అధికారికి ప్రత్యేకంగా డిల్లీ లో ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు.
మంచిర్యాల లో శాంతిభద్రతల కు భంగం వాటిల్లితే అందుకు దివాకర్ రావు బాధ్యత వహించాలని హెచ్చరించారు. కోర్టు పరిధిలో ఉన్న కేసులపై బహిరంగంగా చర్చించడం కోర్టు ధిక్కరణ అవుతుందని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో నైతిక విలువలకు తిలోదకాలివ్వడం శోచనీయమని ఆయన అన్నారు. దివాకర్ రావు చరిత్రను బయటపెట్టడం పెద్ద సమస్య కాదని కానీ రాజకీయాలలో కొన్ని హద్దు గీతలుంటాయని ఆయన సూచించారు. ఆయన కుమారుడు విజిత్ గురుంచి అసభ్యకరమైన ఆడియో ఉందని కానీ ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలగవద్దనే ఉద్దేశ్యంతో బయటపెట్టలేదని తెలిపారు.
అక్రమంగా సంపాదించిన డబ్బు విచ్చలవిడిగా పంచి పెట్టి అక్రమమార్గంలో ఎన్నికల్లో గెలవడానికి అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. తనను ఒంటరిగా ఓడించలేక బీజేపీ తో మిలాఖత్ అయ్యారని విమర్శించారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ మహిళలకు చీరలు, తాగునీరు సరఫరా చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. అందుకే ప్రజలు తనను ఆదరిస్తు ఎమ్మెల్యేగా చూడాలని తహతహలాడుతున్నారని తెలిపారు. బీఆరెఎస్ వాళ్లు డబ్బులిస్తానని చెప్పినా ప్రజలు సమావేశాలకు వెళ్లడం లేదని అన్నారు.
ఈనెల 30వ తేదీన తనకు ఓట్లు వేసి గెలిపించి ప్రజలు అసెంబ్లీ కి పంపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
