– స్వతంత్ర అభ్యర్థి సంఘ సేవకులు ఉమర్.
దౌల్తాబాద్: రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య వైద్యం న్యాయం అందించడమే లక్ష్యంగా పని చేద్దామని దుబ్బాక నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి, సంఘ సేవకులు మహమ్మద్ ఉమర్ అన్నారు.సోమవారం దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందు ప్రియాల్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నో పార్టీలు, ఎంతో మంది నాయకులు అధికారంలోకి వచ్చారని కానీ నియోజకవర్గం మాత్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికలలో ప్రజలకు ఎన్నో ఉచిత పథకాలను తమ తమ మేనిఫెస్టోలో పెట్టి అమలు కానీ హామీలు ఇస్తూ ఓట్లు దండుకుంటున్నారు తప్ప ప్రజల పైన చిత్తశుద్ధితో ఏ పార్టీ పనిచేయడం లేదన్నారు. ప్రజలకు కావాల్సినవి ఉచిత పథకాలు కావనీ, నాణ్యత కూడిన ఉచిత విద్య, వైద్యం,న్యాయం అందించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే చాలని, ప్రజలందరూ నైతిక అభివృద్ధి చెందుతారన్నారు. ఉచిత పథకాల పేరుతో ప్రజలను సోమరిపోతులుగా తయారు చేస్తున్నారు తప్ప మార్పు కోసం, అభివృద్ధి కోసం కాదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలను మానేసి నిజమైన నైతిక అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు.దుబ్బాక నియోజకవర్గంలో గత పాలకులు చేసిన అభివృద్ధి ఏమి లేదని, యువతను అనవసర వ్యసనాలకు బానిసలుగా చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని యువతకు ఉపాధి మార్గాలు చూపించాల్సిందిపోయి, విద్వేషాలు రెచ్చగొడుతూ ఘర్షణలకు దారి తీసే విధంగా పెంచి పోషిస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గం నుంచి తెలుగుదేశం,కాంగ్రెస్,బీజేపి, బీఆర్ఎస్ పార్టీలకు అవకాశం కల్పించడం జరిగింది. ఆయా పార్టీలో నాయకులు అధికారంలోకి వచ్చి చేసిన అభివృద్ధి మన కళ్ళముందే ఉంది అన్నారు. గత ఐదు సంవత్సరాల నుండి దుబ్బాక నియోజకవర్గంలో నిస్వార్ధంగా నిరుపేదలు,అనాధలు, వృద్ధులకు కులమత భేదాలు లేకుండా ఎన్నో ప్రజా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. మరింత ప్రజలకు సేవ చేయడం కోసమే దుబ్బాక నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా సాధారణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందని నియోజకవర్గ ప్రజలందరూ ఆశీర్వదించి గ్యాస్ స్టౌ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవకే అంకితమవుతామన్నారు.ఈ కార్యక్రమంలో ముబాషిర్, సల్మాన్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.




