(మానకొండూర్ నవంబర్ 13)
కరీంనగర్ కమీషనరేట్ లో గల మానకొండూరు పోలీస్ స్టేషన్ ను సోమవారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఆకస్మిక తనిఖీచేశారు. పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించారు.
ఎన్నికల నేరస్థుల, రౌడీ షీటర్ల వివరాలు సి ఐ రాజ్ కుమార్ ను తెలుసుకున్నారు.వీలైనంత ఎక్కువగా ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్, వాహన తనిఖీలు,మండలంలో నిర్వహించి ఓటర్ల కు భద్రతా భావాన్ని కలిగించాలన్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బందితో వారికి కేటాయించబడ్డ ప్రాంత పరిధి గురించి అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో ఎన్నికల ప్రచారం ఎక్కువగా జరగనున్నందున అక్టివ్ గా ఉత్సాహంతో పనిచేయాలన్నారు. మోడల్ కోడ్ ఉల్లంఘనలపై దృష్టి పెట్టాలని, గుర్తిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో గల సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారు. గతంలో ఎన్నికల సమయంలో గొడవలు చేసిన లేదా అల్లర్లను సృష్టించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, ఓటర్లను ప్రభావితం చేసే ఎన్నికల నేరస్థులపై, రౌడీ షీటర్ల పై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని, వారిని సంబంధిత అధికారుల ఎదుట బైండోవర్ చేయాలనీ, ఉల్లంఘిస్తే బౌండ్ డౌన్ చేసి పూచికత్తు సొమ్ము మొత్తాన్ని జప్తు చేయాల్సి వస్తుందని, జైలు శిక్షకూడా విధించబడుతుందని వారికి తెలపాలన్నారు. వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే శాఖపరమైన చర్యలు తప్పవన్నారు. క్షేత్ర స్థాయిలో ఎన్నికల నియమావాళిని రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు అతీతంగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పక్కాగా అమలు పరచాలన్నారు.
ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎస్. హెచ్. ఓ. ఇన్స్పెక్టర్ మాదాడి రాజ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.