ఆధ్యాత్మికం

సిరిసిల్లలో అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమం

261 Views

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీశాల లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం పౌర్ణమి సందర్భంగా రథోత్సవం కనుల పండువలా సాగింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఆలయ పురవీధుల్లో రథోత్సవం కమనీయంగా జరిగింది.

అక్టోబర్ 21 నుంచి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగాయి. తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల తరహాలోనే ఇక్కడ సైతం ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారి వాహనసేవలు జరిగాయి. ఉదయం ఆలయంలో అర్చకులు పూర్ణాహుతి, హోమం, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు రథంపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి, రాష్ట్ర పవర్ లుం, టెక్స్టైల్స్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రవాణిలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సాయంత్రం ఐదు గంటలకు రథోత్సవం నిర్వహించవలసి ఉండగా శనివారం రాత్రి చంద్రగ్రహణం సంభవిస్తున్న నేపథ్యంలో రథోత్సవాన్ని ఆలయ అధికారులు మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించారు. స్వామివారు ఉభయదేవేరులతో కలిసి రథంపై పురవీధుల్లో విహరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జాతరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *