మంచిర్యాల లో ఎన్నికల సందర్భంగా గందరగోళం, ఘర్షణలు సృష్టించడానికి ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు, ఆయన తనయుడు నడిపెళ్లి విజిత్ రావు రాయలసీమ, ఆంధ్ర ప్రాంతం నుంచి అనుమానాస్పద వ్యక్తులను తీసుకువచ్చారని కాంగ్రెస్ అభ్యర్ధి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆరోపణలు చేశారు.
శుక్రవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రేమ్ సాగర్ రావు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని గమనించిన ఎమ్మెల్యే గుంటూరు, కర్నూల్ నుంచి గుండాలను తీసుకువచ్చాడని తెలిపారు.
ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో వారికి ఆశ్రయం ఇచ్చాడని తెలిపారు. ఎన్నికల్లో గొడవలు, అలజడలు సృష్టించి ప్రజలను భయపెట్టేందుకు భారీ కుట్ర పన్నారని తెలిపారు. రెండు రోజుల క్రితం వారి ఆచూకీ బయటపడడంతో పక్కన ఉన్న లాడ్జికి మకాం మార్చారని చెప్పారు. అక్కడ నలుపు రంగు కారులో వారిని మరోచోటుకు తరలించారని అభియోగించారు. తనపై కూడా బౌతికదాడులు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని సందేహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే హయాంలో గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు, యువత బానిసలు అయ్యారని అన్నారు.
మంచిర్యాల లో మున్సిపల్ కార్యాలయం ముందు పట్టపగలు బహిరంగంగా మహిళ హత్య, రైలువై స్టేషన్ వద్ద మహిళ హత్యతో పాటు రియల్ ఎస్టేట్ గొడవలో ఆయన బంధువు హత్యకు గురయ్యారని శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని కాప్ర స్థలం వివాదంను ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు రాజకీయంగా వాడుకోవడానికి నీచమైన సంస్కృతికి పాల్పడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు మండిపడ్డారు.
కాప్రా లో స్థలం కొనుగోలు చేయగా గోపాల్ రావు అనే వ్యక్తి ఉద్దేశ్యపూర్వకంగా వివాదం సృష్టిస్తున్నాడని ఆరోపించారు. 2005లో తమ సంస్థ పొజిషన్ లో ఉందని ఆర్డర్ కాపీ ఇచ్చిందని తెలిపారు. 2019లో లే అవుట్ స్థలం కాదని జీ హెచ్.ఎం.టీ కార్యాలయం ఆర్డర్ ఇచ్చిందన్నారు. గోపాల్ రావు కేసులు, కోర్టు అంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేశాడని కొంత మంది జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారని తెలిపారు.
ఇదే అదనుగా మంచిర్యాల ఎమ్మెల్యే గోపాల్ రావుకు డబ్బులు ఇచ్చి కొంత మందిని మంచిర్యాల కు తీసుకు వచ్చి ఆత్మహత్య యత్నం చేసి నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. ప్రజలు ఎమ్మెల్యే ఆయన తనయుని ఆగడాలు, గుండాయిజం గురుంచి నిజాలు తెలుసుకోవాలని ప్రేమ్ సాగర్ రావు కోరారు. తాను గెలిస్తే అభివృద్ధి తో పాటు శాంతి భద్రతలు కాపాడుతానని ప్రేమ్ సాగర్ రావు భరోసా ఇచ్చారు.






