స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుక కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ లో కన్నుల పండువగా జరిగింది. అత్యంత శోభాయమానంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశ ఔన్నత్యాన్ని చాటుతూ తెలంగాణ ప్రగతికి అద్దం పట్టాయి. హెచ్ ఐసీసీ వేదికగా నిర్వహించిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వేదిక ప్రాంగణం చేరుకున్న సీఎంకు పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, డీజీపీ శ్రీ అంజనీ కుమార్ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని సీఎం స్వీకరించారు.
అనంతరం ముఖ్యమంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం సమర్పించారు. జాతీయ గీతాలాపన చేశారు.
వేదిక వద్దకు చేరుకున్న సీఎం, వేదిక ముందు ఏర్పాటు చేసిన గాంధీ మహాత్ముడి విగ్రహానికి, భరత మాత చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాల వీక్షణం కోసం ఆసీనులైనారు.
తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.





