*మూడ్రోజులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు: వాతావరణ శాఖ*
*తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఇప్పటికే 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.*
నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేయగా.. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు సోమవారం రాత్రి నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. నగరంలో మరో ఆరు గంటల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
మెహదీపట్నం, టోలీచౌకి, షేక్ పేట్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, అంసెబ్లీ, కోఠి, మలక్పేట్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, నారాయణగూడ, హిమాయత్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ సికింద్రబాద్, ఉప్పల్, తార్నాక, రామంతాపూర్తో పాటు నగర వ్యాప్తంగా కుండపోతగా వర్షం పడుతోంది. దీంతో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరించింది ఇప్పటికే సహాయక చర్యలకు డీఆర్ఎఫ్ సిబ్బందిని జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. కాగా, అర్ధరాత్రి నుంచి వర్షం పడుతుడంతో ఎక్కడికక్కడ రోడ్లమీద వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పలు చోట్ల భారీగా ట్రాఫక్ జామ్ అయింది.





