దౌల్తాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గురువారం మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామ చెరువు నిండి అలుగు పారడంతో రైతులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మత్స్యకారులు, గ్రామస్తులు మత్తడి వద్ద చేపలు పడుతున్నారు. మత్తడి వద్ద సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, సర్పంచ్ చిత్తారి గౌడ్ లు పరిశీలించి గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గ్రామస్తులు కట్టపై నుండి జాగ్రత్తగా వెళ్లాలని, చేపలు పట్టడానికి మత్స్యకారులు, గ్రామస్తులు వెళ్లకూడదని అన్నారు. అలాగే గోవిందా పూర్ నుండి ఉప్పరపల్లి, గువ్వలేగి గ్రామాలకు వెళ్లే దారిలో కల్వర్టు పై నుండి నీరు వెళ్తాయని గ్రామస్తులకు సూచించారు. కల్వర్టు పై నుండి ఎక్కువ నీరు వెళితే బారికేడు ఏర్పాటు చేయాలని సర్పంచ్ కు సూచించారు.




