హైదరాబాద్: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి పెన్షన్ను రూ.1000 పెంచుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే.. ఇప్పటివరకూ ప్రతి నెల రూ.3016 పెన్షన్ అందుకున్న దివ్యాంగులు.. ఈ పెంపుతో రూ.4016 పెన్షన్ను అందుకోబోతున్నారు. మంచిర్యాల సభ వేదికగా దివ్యాంగుల పెన్షన్ని పెంచబోతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తానిచ్చిన మాటని నిలబెట్టుకుంటూ.. సంబంధిత ఫైల్ను కేసీఆర్ ఆమోదించారు. ఈ పెంపుతో.. దివ్యాంగులకు అత్యధిక పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. రాష్ట్రవ్యాప్తంగా 5లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది. దివ్యాంగుల పెన్షన్ను పెంచుతూ ఉత్వర్వులు వెలువడిన సందర్భంగా.. సీఎం కేసీఆర్కి పుష్పగుచ్ఛం అందిస్తూ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ట్విటర్ మాధ్యమంగా హర్షం వ్యక్తం చేశారు. దేశంలో మునుపెన్నడూ లేనివిధంగా దివ్యాంగులకు రూ.4016కు పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని.. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో 5 లక్షల మందికిపైగా దివ్యాంగులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. పెన్షన్ల పెంపు బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్న ఆయన.. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.





