Breaking News

Manipur Files : కుకీ వ్యక్తి తల నరికి తడికెకు వేలాడదీత!*

115 Views

*Manipur Files : కుకీ వ్యక్తి తల నరికి తడికెకు వేలాడదీత!*

*మణిపూర్‌లో మరో ఘాతుకం*

*ఈ నెల 2న ఘటన.. తాజాగా బయటకు*

*హతుడు డేవిడ్‌ థీక్‌.. వీడియో వైరల్‌*

*విష్ణుపూర్‌ జిల్లాలోని ఇళ్ల మధ్యే ఘటన*

*మహిళలపై దారుణంలో దిగ్ర్భాంతికర*

*విషయాలు.. గ్రామంలో లూటీ, రేప్‌!*

*బాధితుల్లో ఒకరు మాజీ సైనికుడి భార్య*

*కార్గిల్‌ యుద్ధంలో దేశాన్ని రక్షించా..*

*కాని  నా , భార్యను కాపాడుకోలేకపోయా*

*మాజీ సైనికుడి ఆవేదన*

 

*ఇంఫాల్‌, న్యూఢిల్లీ, జూలై 22: మణిపూర్‌లో మరో దారుణం.*

 

ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, వారిపై అత్యాచారానికి పాల్పడిన ఉదంతం దుమారం రేపుతుండగానే.. ఓ యువకుడి తల నరికి వెదురు తడికెకు వేలాడదీసిన ఘటన వెలుగులోకి వచ్చింది. హతుడు కుకీ తెగకు చెందిన డేవిడ్‌ థీక్‌. విష్ణుపూర్‌ జిల్లాలోని నివాస ప్రాంతంలో ఈ నెల 2న అర్ధరాత్రి అతడిని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇదే రోజు ఆ ప్రాంతంలో పెద్దఎత్తున ఘర్షణలు జరిగాయి. ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు థీక్‌ తలను తడికెకు తగిలించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా, మణిపూర్‌లో శుక్రవారం మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించి, అత్యాచారానికి పాల్పడిన ఘటనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో మరిన్ని దిగ్ర్భాంతికర విషయాలు బయటకు వచ్చాయి.

*గ్రామంలో అంతకుముందే అత్యాచారం!*

వెయ్యిమందితో కూడిన మూక మే 4న కాంగ్పొక్పి జిల్లాలోని గ్రామంపై విరుచుకుపడి ఒకరి హత్యతో పాటు, లూటీ, గృహ దహనాలు, అత్యాచారాలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు సైకుల్‌ ఠాణాలో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ”తెల్లవారుజామున 3 గంటలకు 900 ఏకే రైఫిళ్లు, ఎస్‌ఎల్‌ఆర్‌లు, ఇన్సాస్‌, పాయింట్‌ 303 రైఫిళ్లతో విరుచుకుపడ్డారు. డబ్బు, ఫర్నీచర్‌తో పాటు చేతికందిన వస్తువులను తీసుకున్నారు. మొత్తం ఇళ్లను కూల్చివేసి నిప్పంటించారు. ఐదుగురిని తమవెంట తీసుకెళ్లారు” అని ఓ బాధితుడు తెలిపారు. కాగా, మహిళలపై దారుణానికి పాల్పడిన ఘటనలో గురువారం ప్రధాన సూత్రధారి హీరాదాస్‌, మరో నిందితుడిని అరెస్టు చేయగా.. శుక్రవారం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టు 11 రోజుల పోలీస్‌ కస్టడీకి అప్పగించింది. నలుగురిలో తౌబాల్‌ జిల్లా పేచీ అవాంగ్‌లో ఉన్న ప్రధాన నిందితుడి ఇంటికి గురువారం అర్థరాత్రి స్థానికులు నిప్పంటించారు. పరారీలోని మరో నిందితుడి ఇంటిని శుక్రవారం దహనం చేశారు. కాగా, మహిళలపై దారుణం ఉదంతం నంగ్‌పోక్‌ పోలీస్‌ స్టేషన్‌కు కిలోమీటరు దూరంలోనే జరిగింది. ఇది 2020లో దేశ ఉత్తమ ఠాణాగా నిలవడం గమనార్హం. రాష్ట్రంలోని పరిస్థితిపై భద్రతా సంస్థలు నిశిత దృష్టిపెట్టాయి. ఇప్పటివరకు దాదాపు 6 వేల కేసులు నమోదయ్యాయి.

*ఏమున్నది మా ఊరిలో?: బాధితురాలి తల్లి*

”మా ఇల్లు, పొలాలు ధ్వంసం చేశారు. మా చిన్నోడిని కష్టపడి 12వ తరగతి వరకు చదివించా. ఇపుడు వాడు లేడు. వాళ్ల నాన్ననూ చంపేశారు. నా కుమార్తెపై అత్యంత దారుణ ఘటనకు ఒడిగట్టారు. ఇక ఏముందని మా ఊరికి వెళ్లాలి” అంటూ అత్యాచార బాధితురాలి తల్లి వాపోయింది. ”అమానవీయ ఘటనలను తలచుకుంటే మాటలు రావడం లేదు. ఇది ఒక జాతిపై జరిగిన దారుణం కాదు. మానవత్వానికే మచ్చ. నిందితులకు పెరోల్‌కు వీల్లేకుండా జీవిత ఖైదు విధించాలి” అంటూ మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. కేంద్రం సకాలంలో స్పందించి ఉంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదన్నారు. సైన్యం ప్రత్యేకాధికారాల చట్ట రద్దు కోరుతూ 16 ఏళ్లు నిరశన దీక్ష చేసిన షర్మిల హక్కుల కార్యకర్తగా పేరొందారు.

*బెంగాల్‌లోనూ అత్యాచారాలు: లాకెట్‌ ఛటర్జీ*

టీఎంసీ కార్యకర్తలు ఈనెల 8న తమ మహిళా అభ్యర్థిని వివస్త్రను చేసి దారుణంగా ప్రవర్తించినట్లు బీజేపీ హుగ్లీ ఎంపీ లాకెట్‌ ఛటర్జీ ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ఘటన జరిగిందని చెబుతూ ఆమె కన్నీంటి పర్యంతమయ్యారు.

‘కార్గిల్‌’లో దేశాన్ని రక్షించా.. భార్యను కాపాడుకోలేకపోయా..

*”మారణాయుధాలతో ఓ మూక జంతువుల మాదిరిగా మా ఊరి మీద పడ్డారు*.

ప్రజలందరి ముందు నా భార్యను వివస్త్రను చేశారు. దీనిని పోలీసులు చూస్తూ ఉండిపోయారు. నేను కార్గిల్‌ యుద్ధంలో దేశం కోసం పోరాడా. శాంతి పరిరక్షక దళం సభ్యుడిగా శ్రీలంకలోనూ పనిచేశా. కానీ, స్వదేశంలో సొంత ఊరి వారిని, భార్యను కాపాడుకోలేకపోయా” అంటూ నగ్నంగా ఊరేగించిన ఇద్దరు మహిళల్లో ఒకరి భర్త వాపోయాడు. ఈయన అసోం రెజిమెంట్‌లో పనిచేసి రిటైరయ్యాడు. ”విశ్రాంత జీవితంలో.. వ్యక్తిగతంగా జరిగిన నష్టాన్ని చూసి కుంగిపోయా. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నా” అని కోరారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *