పారిపోయిన నిందితుడిని 24 గంటల్లో పట్టుకున్న సిద్దిపేట పోలీసులు
సిద్దిపేట్, జులై 26, తెలుగు న్యూస్ 24/7
పారిపోయిన నిందితుడిని 24 గంటల్లో పట్టుకున్న సిద్దిపేట పోలీసులు,నిన్న అనగా తేదీ 25-07-2026 రోజున సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి నుండి పోలీసుల కన్నుగప్పి పారిపోయిన నిందితుడిని సిద్దిపేట పోలీసులు కేవలం 24 గంటల్లోనే అరెస్టు చేశారు.నిన్న మధ్యాహ్నం నిందితుడిని సాధారణ వైద్య పరీక్షల (జనరల్ చెకప్) నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పోలీసు వ్యాన్లో ఉండగా తన చేతులకు వేసిన సంకెళ్లను ఊడదీసుకుని, వాహనం అత్యవసర ద్వారం (ఎమర్జెన్సీ డోర్) ద్వారా బయటకు దూకి, సమీపంలోని సందులోంచి పారిపోతూ కోమటిచెరువు కట్టమీద ఉన్న బైక్ ని దొంగిలించి అక్కడి నుండి పరారయ్యాడు.ఈ ఘటనపై వెంటనే స్పందించిన సిద్దిపేట పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ ఫుటేజ్లు మరియు ఇతర ఆధారాల సహాయంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడిని ఈరోజు మధ్యాహ్నం సుమారు 12.00 గంటలకు, పరారైన 24 గంటల్లోపే దొంగ ను కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపాన అదుపులోకి తీసుకున్నారు.పారిపోయిన నిందితుడిని చాకచక్యంగా గుర్తించి అరెస్టు చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ అభినందించి, వారి సమయస్ఫూర్తి, సమన్వయం మరియు విధి నిర్వహణలో చూపిన నిబద్ధతను ప్రశంసించారు.





