*రామగుండం పోలీస్ కమిషనరేట్*
*బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం :పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా*
ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించి, బాధితులకు తక్షణ భరోసా కల్పించడమే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “ప్రజావాణి” కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి,వారి సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకున్నారు.
బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా సీపీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని, ఆపదలో ఉన్న వారికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి పలు ఫిర్యాదులు అందాయి.వీటిపై వెంటనే స్పందించిన పోలీస్ కమిషనర్, సంబంధిత స్టేషన్ హౌస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఫిర్యాదుల వివరాలను తెలుసుకున్నారు.చట్ట పరిధిలో ఉన్న ప్రతి ఫిర్యాదుపై ఎలాంటి జాప్యం లేకుండా, పూర్తి పారదర్శకతతో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులకు సంబంధించిన ఫిర్యాదుల విషయంలో అత్యంత సున్నితంగా, మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.





