రాంసాగర్ గ్రామంలోని రామాలయంలో మంగళవారం భద్రాచల రామయ్య కల్యాణ ముత్యాల తలంబ్రాల పంపిణి కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు. శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు భక్తులతో భజనలు చేయించి తలంబ్రాల పవిత్రత, విశిష్టతను వివరించి భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాంసాగర్ గ్రామం నుంచి భద్రాచల శ్రీరామ కళ్యాణానికి పెద్ద ఎత్తున గోటి తలంబ్రాలు పంపించినట్లు తెలిపారు. భద్రాచలం నుంచి 100 కిలోల ముత్యాల తలంబ్రాలు భక్తుల కోసం తీసుకొచ్చినట్లు చెప్పారు. భద్రాచలం వెళ్లలేకపోయినా తమ గోటి తలంబ్రాలు అక్కడికి చేరాయని, ఇప్పుడు ముత్యాల తలంబ్రాలు తిరిగి అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. రామకోటి రామరాజు చేస్తున్న ఆధ్యాత్మిక సేవలు, పట్టుదల ప్రశంసనీయమని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలని భక్తులు కోరారు. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ అధ్యక్షులు ఎమిశెట్టి వెంకటేశం, సర్పంచ్ భాగన్న గారి నరేష్ గౌడ్, ఉప సర్పంచ్ పోచయ్య, నాయిని ఆదిరెడ్డి, బిక్కుమల్ల నాగేష్, పడగంటి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.





