రామగుండం పోలీస్ కమిషనరేట్
*ఉపాధ్యాయులకు షీ టీమ్స్పై అవగాహన సదస్సు*
*విద్యార్థుల భద్రతలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం: ఎస్ఐ.హైమ*
పాఠశాల విద్యార్థుల భద్రత,మహిళల రక్షణలో షీ టీమ్స్ పాత్రతో పాటు సైబర్ నేరాల పట్ల అప్రమత్తతపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో నేడు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్లో జనగణన శిక్షణలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా షీ టీమ్ ఎస్ఐ.హైమ మాట్లాడుతూ, విద్యార్థులు తమ సమస్యలను తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఉపాధ్యాయులతో పంచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గమనించి,వారికి ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే షీ టీమ్స్కు సమాచారం అందించాలని సూచించారు.వేధింపులకు గురయ్యే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.వేధింపులకు గురయ్యే మహిళలు మరియు బాలికలకు షీ టీమ్స్ అందించే సహాయం గురించి వివరించారు. చిన్న పిల్లలకు గుడ్ టచ్,బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించడంలో ఉపాధ్యాయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. సోషల్ మీడియా వినియోగం,ఆన్లైన్ వేధింపులు మరియు సైబర్ నేరాల బారిన పడకుండా విద్యార్థులను ఎలా రక్షించాలో వివరించారు.ఆన్లైన్ మోసాలకు గురైనపుడు బాధితులు గోల్డెన్ అవర్లోపు సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
బాలల హక్కులు మరియు పోక్సో చట్టంపై ఉపాధ్యాయులకు కనీస అవగాహన ఉండాలని తెలిపారు. విద్యార్థినులు మరియు మహిళల భద్రత కోసం T-Safe యాప్ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే విధానం గురించి వివరించారు.
పని ప్రదేశాల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో మహిళలను ఎవరైనా వేధింపులకు గురి చేస్తే వెంటనే డయల్ 100 లేదా 112కు, అలాగే రామగుండం షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 6303923700కు సమాచారం అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఆఫీసర్ సంపత్ కుమార్, జనగణన శిక్షకులు హరిప్రసాద్, మధుబాబు, మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఇన్చార్జి ఎస్ఐ. హైమ,కానిస్టేబుల్ సతీష్,మహిళా కానిస్టేబుల్ శ్రీలత మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.





