
రాచర్ల గొల్లపల్లి లో అగ్ని ప్రమాదం తక్షణమే స్పందించిన యువత తప్పిన పెను ప్రమాదం
రాచర్ల గొల్లపల్లి గ్రామంలోనీ గంగమ్మ గుడి వాగు ప్రాంతంలో చెత్తను పడేయడంతో ఆ ప్రాంతం అంతా ప్లాస్టిక్ కవర్ వ్యర్థాలతో చెత్తతో నిండి పోయింది.ప్రమాదవశాత్తు ఆ చెత్తకు నిప్పు అంటుకోవడంతో ఆ ప్రక్కనే వరి ధాన్యం ఆర బోసిన రైతులు కంగారు పడ్డారు.అక్కడే ఉన్న బాలుర వసతి గృహం,ఇందిరమ్మ కాలనీ ప్రాంతం అంతా దట్టమైన పొగ వాటిల్లడంతొ ప్రజలు భయాందోళనకు గురయ్యారు.వెంటనే అక్కడున్న యువత స్పందించి ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకొని ట్యాంకర్ల ద్వారా గ్రామ పంచాయతీ సిబ్బందితో నీటిని తెప్పించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.సమయానికి ఫైరింజన్ చేరుకొని సిబ్బంది ఎగసి పడుతున్న మంటలను చల్లార్చడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది.ఈ సందర్భంగా సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ మాట్లాడుతూ జరిగిన సంఘటన వలన ఎలాంటి నష్టం జరుగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నామని వరి ధాన్యం కుప్పలు తగలబడితే రైతులు పెద్ద ఎత్తున నష్ట పోయేవారని ఆవేదన వ్యక్తం చేస్తూ,గంగమ్మ గుడి బ్రిడ్జి ప్రాంతం నుండి వాగు పరిసర ప్రాంతాల్లో చెత్త పడవేయడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని రోజు చెత్త ట్రాక్టర్ వస్తున్నా ఈ ప్రాంతంలో చెత్త పడవేయడం సరికాదని,ఎవరు ఇక్కడ చెత్త పారబోసినా వారికి గ్రామ పంచాయతీ తరపున ఫైన్ విధిస్తామని హెచ్చరించారు.ఈ సంఘటన జరిగిన వెంటనే స్పందించిన యువతను గ్రామ పంచాయతీ సిబ్బందినీ గ్రామస్తులను సర్పంచ్ అభినందించారు.





