తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని నినాదాలు..
హైదరాబాద్, మార్చి 29: తెలంగాణ
అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ నేతలు సభలో నిరసనలు చేపట్టారు. రాఘవ కన్స్ట్రక్షన్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. విపక్షాల నినాదాల మధ్యే ప్రభుత్వం 2 బిల్లులు ప్రవేశపెట్టింది. బీఆర్ఎస్ నేతలు సభలో గందరగోళం సృష్టించటంపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ అంశంపై ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన తర్వాత హౌస్ కమిటీ ఎందుకు? అని ప్రశ్నించారు.సీఐడీ కంటే పెద్ద సంస్థ ఉంటుందా? అని కూడా మంత్రి శ్రీధర్బాబు ప్రశ్నించారు. తప్పు చేస్తే ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ దగ్గర ఆధారాలు ఉంటే సీఐడీకి ఇవ్వొచ్చని అన్నారు. నిరసనలతో సభను అడ్డుకోవడం సరికాదని చెప్పుకొచ్చారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ..‘తల్లిదండ్రుల సంరక్షణ కోసం బిల్ పెడుతున్నాం. తల్లిదండ్రులపై బాధ్యత ఉండాలని బిల్ పెడుతున్నాం. సభ సజావుగా నడవకుండా బీఆర్ఎస్ సభ్యులు అడ్డుకుంటున్నారు. తల్లిదండ్రుల సంరక్షణ బీఆర్ఎస్ సభ్యులకు అవసరం లేదా?’ అని మంత్రి ప్రశ్నించారు.ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పిన బీజేపీ ఎమ్మెల్యే.రాఘవ కన్స్ట్రక్షన్ వ్యవహారంపై ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించినందుకు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. సీఐడీతో పాటు హౌజ్ కమిటీ కూడా వేయాలని కోరారు. లేదంటే బీఆర్ఎస్ నేతలు గొడవ చేస్తారని, మీరు బిల్లు అమోదం తెలుపుకుంటారని అన్నారు. దీంతో ప్రజలకు ఎలాంటి లాభం ఉండదని చెప్పుకొచ్చారు..





