స్పష్టమైన ఓటరు జాబితా తయారీకి బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలి,జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా,మార్చి 17, 2026:
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్ రావు దేశ్ పాండే లతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం త్వరలో ప్రారంభం కాబోతుందని, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ పార్టీ తరఫున బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ద్వారా 2002 ఓటర్ జాబితాకు 2025 ఓటర్ల జాబితాను మ్యాపింగ్ చేసి ఎలాంటి పొరపాట్లు లేని ఓటరు జాబితా సిద్ధం చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా మరణించిన, షిఫ్ట్ అయిన ఓటర్లను జాబితా నుంచి తొలగించడంలో బూత్ స్థాయి ఏజెంట్లను నియమించడం ద్వారా సహకరించాలని తెలిపారు. బూత్ స్థాయి ఏజెంట్లుగా నియమించబడిన వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. డబల్ ఓటు ఎవరికైనా ఉన్నట్లయితే వారు స్వచ్ఛందంగా తమ ఒక ఓటును తొలగించుకోవాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





