దౌల్తాబాద్ మండలంలోని కోనాపూర్ గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసిస్తున్న లబ్ధిదారులకు త్వరలోనే ఇంటి పట్టాలు మంజూరు చేయనున్నట్లు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి, టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి గణేష్ పంచమి కలిసి కోనాపూర్ గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు వెంటనే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి జిల్లా కలెక్టర్ హైమావతితో ఫోన్లో మాట్లాడి విషయం వివరించారు. లబ్ధిదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా పట్టాల మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం కోసం ఉపాధి హామీ నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేయాలని నాయకులు విజ్ఞప్తి చేయగా, ఆ ప్రతిపాదనను పరిశీలించి మంజూరు చేయడానికి మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ సూరంపల్లి ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





