మహోన్నత చరిత్ర కలిగిన ప్రాంతం “గాంధారి ఖిల్లా”జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా , ఫిబ్రవరి 26, 2026 :
జిల్లాలోని మందమర్రి మండలంలోని గాంధారి ఖిల్లాకు మహోన్నత చరిత్ర ఉందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో నాయక్పోడ్ సేవా సంఘం ప్రతినిధి పల్ల సత్యనారాయణ, పుస్తక రచయిత మేసినేని రాజన్న, నాయక్పోడ్ హక్కుల పరిరక్షణ కమిటీ ప్రతినిధి గంజి రాజన్న, జిల్లా ప్రతినిధులు పెద్ది రాజన్న, గాంధారి మైసమ్మ ఆలయ కమిటీ ప్రతినిధి దైనేని రమేష్ లతో కలిసి గాంధారి ఖిల్లా చరిత్ర భాగం-1 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పూర్వకాలం ఈ ప్రాంతంలో పాండవులు పర్యటించినట్లు చరిత్ర ఉందని, గిరిజనులు పాండవులను ఆరాధ్య దైవాలుగా కొలుస్తారని తెలిపారు. తెలంగాణలో వనదేవతలను కొలిచే ఆచారం ప్రసిద్ధి పొందిందని, ఈ క్రమంలో గాంధారిఖిల్లా మైసమ్మను దేవతగా కొలుస్తారని తెలిపారు. మహోన్నత చరిత్ర కలిగిన గాంధారి ఖిల్లా ప్రాంత వైభవాన్ని, చరిత్రను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో పుస్తక రచన చేయడం అభినందనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది*





