గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా ,ఫిబ్రవరి 26, 2026:
గోదావరి పుష్కరాల నిర్వహణకు పూర్తి కార్యచరణ సిద్ధం చేయగలరు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశం మందిరంలో రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా, డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు లతో కలిసి గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై దేవాదాయ, పోలీస్, రెవెన్యూ, వైద్య, విద్యుత్, మత్స్య, నీటిపారుదల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు దక్షిణాది కుంభమేళా తరహాలో ఉంటాయని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గోదావరి నది పరివాహకంలో అనువైన ప్రాంతాలలో పుష్కరాల ఏర్పాట్ల కొరకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా జిల్లాలోని గోదావరి నది తీర ప్రాంతాలలో పుష్కర ఘాట్ల ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి కార్యచరణ సిద్ధం చేయాలని తెలిపారు. అధిక సంఖ్యలో మంచిర్యాల పట్టణంలోని గోదావరి తీరంలో పుష్కర స్నానాలు ఆచరిస్తారని, తరువాత గూడెంలో అధిక సంఖ్యలో భక్తులు పుష్కర స్థానాలకు హాజరవుతారని తెలిపారు. పార్కింగ్, హోల్డింగ్ ఏరియా, పండల్ ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, ప్రజా రవాణా వ్యవస్థ, డ్రోన్ ద్వారా పర్యవేక్షణ, పుష్కర ఘాట్ ప్రాంతాలలో లైటింగ్, త్రాగునీటి ఏర్పాట్లపై ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని, ఈ విషయమై త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రితో సమీక్ష ఉంటుందని తెలిపారు. ఈ మేరకు రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో ప్రతిపాదనలు, కార్యచరణ సిద్ధం చేసి అందించాలని తెలిపారు. పుష్కరాలలో భక్తుల సంఖ్య అంచనా ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఈ క్రమంలో మంచిర్యాలలో 2 లక్షల మంది, వేలాలలో 50 వేల మంది, చెన్నూరు ప్రాంతంలో సైతం అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. నీటిపారుదల శాఖ నివేదిక ఆధారంగా నూతన ఘాట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వెలుతురు, పారిశుద్ధ్యం అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి కార్యచరణ రూపొందించాలని తెలిపారు. భక్తుల సంరక్షణ దిశగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో పుష్కర స్నానాల ప్రాంతాలలో గజా ఈతగాళ్లను ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉండాలని, పుష్కరాల నిర్వహణ కొరకు నోడల్ అధికారులను నియమించడం జరుగుతుందని తెలిపారు.
కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు అంచనాలకు మించి భక్తులు వచ్చే అవకాశం ఉందని, కార్యచరణ రూపొందించడంలో జాగ్రత్తలు వహించాలని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో కార్యచరణ రూపొందించాలని, పుష్కరాల సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తదనగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. పుష్కర ఘాట్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





