రాయపోల్ మండలంలో ఉపాధి హామీ పథకం అమలుపై పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో డీఆర్డీఓ జయదేవ్ ఆర్య సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఉపాధి హామీ కూలీలకు నిరంతరంగా పని కల్పించేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. నర్సరీల అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆదేశాలు చేశారు. పనుల అమలులో నిర్లక్ష్యం వహించకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ శివకుమార్, ఏపీఓ జనార్ధన్, ఏపీఎం యాదగిరి, హౌసింగ్ ఏఈ విద్యాసాగర్తో పాటు పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.





