శాంతియుతంగా, స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్.
మంచిర్యాల జిల్లా,జనవరి 21, 2026:
2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు – 2026 శాంతియుతంగా, స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా జరిగేలా 163 బి ఎన్ ఎస్ ఎస్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్, పోలింగ్, లెక్కింపు వంటి కీలక కార్యక్రమాల సమయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. చట్ట ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి నిర్ణయించిన 48 గంటల వ్యవధిలో నిబంధనలను ఉల్లంఘించే కార్యక్రమాలు, బహిరంగ సమావేశాలు నిషేధించడం జరిగిందని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి బహిరంగ సభ, ఊరేగింపు, ప్రసంగాలు, ప్రసార, ప్రచార సాధనాల ద్వారా ప్రచారం, ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలను నిర్వహించడం నిషిద్ధమని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆయుధాలు కలిగి ఉండడం, ప్రచార వాహనాలు, ప్రచారం చేయడం, 5 కంటే ఎక్కువమంది కలిసి ఉండడం, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయడం నిషేధించడం జరిగిందని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై భారత్ నాగరిక్ సురక్ష సంహిత చట్టంతో పాటు ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





