*రామగుండం పోలీస్ కమీషనరేట్*
“Arrive Alive” కార్యక్రమంలో రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో అవగాహన – రామగుండం పోలీసుల విస్తృత చర్యలు
పాఠశాలలు, కళాశాలల్లో రోడ్డు భద్రతపై వ్యాసరచన పోటీలు
ట్రాఫిక్ నియమాలపై విద్యార్థుల్లో చైతన్యం కల్పించిన రామగుండం కమీషనరేట్ పోలీసులు
తెలంగాణ రాష్ట్ర గౌరవ డీజీపీ ఆదేశాల మేరకు, తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “Arrive Alive” (సురక్షిత ప్రయాణం – క్షేమంగా గమ్యానికి) అవగాహన కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటన లో తెలిపారు.
రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా గారి ఆదేశాల మేరకు, అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తూ వ్యాసరచన, ముగ్గుల, పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల పట్ల బాధ్యతాయుతమైన దృక్పథం ఏర్పడేలా చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ… “దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మానవ తప్పిదాల వల్లనే సంభవిస్తున్నాయి. చిన్న వయసు నుంచే రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరం. హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చు. విద్యార్థులు ఈ అవగాహనను తమ కుటుంబ సభ్యులు, సమాజంలోనూ పంచుకోవాలి” అని తెలిపారు.
అదేవిధంగా, భవిష్యత్ పౌరులైన విద్యార్థులు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తూ, సురక్షిత ప్రయాణానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. “Arrive Alive” కార్యక్రమం లక్ష్యం ఒక్కటే – ప్రతి వ్యక్తి క్షేమంగా గమ్యానికి చేరుకోవడం అని ఆయన స్పష్టం చేశారు.





