జిల్లాలో మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల ఖరారు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా,జనవరి 17, 2026:
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ లతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లాలోని మున్సిపల్ వార్డుల వారీగా రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు, బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలో 34 వార్డులు, చెన్నూర్ మున్సిపల్ పరిధిలో 18 వార్డులు, క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో 22 వార్డులు, లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలో 15 వార్డులకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, జనరల్ మహిళ, జనరల్ స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





