చిన్నారుల అవగాహనతోనే రహదారి భద్రత సాధ్యం: ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో బెజ్జంకి ఎస్ఐ సౌజన్య
సిద్దిపేట జిల్లా,జనవరి 17, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, రహదారి ప్రమాదాల నివారణే ధ్యేయంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ (అరైవ్ అలైవ్) కార్యక్రమంలో భాగంగా శనివారం బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలిసి బెజ్జంకి పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బెజ్జంకి ఎస్ఐ సౌజన్య పాఠశాల విద్యార్థులకు రహదారి నిబంధనలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ప్రధాన రహదారిపై వాహనదారులకు, ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్ఐ సౌజన్య మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారానే విలువైన ప్రాణాలను కాపాడుకోగలరని తెలిపారు. చిన్నతనం నుంచే పిల్లలకు రహదారి నిబంధనలపై అవగాహన ఉంటే, తమ తల్లిదండ్రులను ఇతరులను,హెచ్చరించగలరని, తద్వారా సమాజంలో మార్పు వస్తుందని పేర్కొన్నారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగంతో ప్రయాణించవద్దని, మైనర్స్ వాహనం నడపవద్దని , సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపవద్దని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని వాహనదారులకు పిల్లల ద్వారా వివరించారు.చిన్నారులు వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ గురించి వివరించడం అందరినీ ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.





