సిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఎస్. రష్మీ పెరుమాళ్ ను రాయపోల్ ఎస్ఐ మానస మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాయపోల్ మండల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, ప్రజలతో స్నేహపూర్వక పోలీసింగ్ కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో నేరాల నియంత్రణ, రాత్రి గస్తీ పటిష్టత, సీసీ కెమెరాల పర్యవేక్షణ వంటి అంశాలపై ఎస్ఐ మానస కమిషనర్కు వివరించారు. ముఖ్యంగా మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలు, పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో భద్రత చర్యలు, మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాల గురించి తెలియజేశారు. అనంతరం కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ ప్రజాభద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా, నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. చట్టపాలనలో రాజీ లేకుండా నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో ప్రజల నమ్మకం గెలుచుకునేలా స్నేహపూర్వక పోలీసింగ్ కొనసాగించాలని ఆదేశించారు. మహిళా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.





