తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర మహిళా మంత్రులకు ఆత్మీయ ఆహ్వానం పలికారు. గురువారం ఎర్రవెల్లి నివాసంలో పంచాయతీ రాజ్, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క, దేవదాయ ధర్మదాయ–అటవీ శాఖ మంత్రి కొండా సురేఖలు కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ ప్రభుత్వ తరఫున మంత్రులు కేసీఆర్కు ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా శాలువాతో పాటు ఆహ్వాన పత్రికను అందజేయడంతో పాటు మేడారం ప్రసాదాన్ని సమర్పించారు. తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరిస్తూ కేసీఆర్, శోభమ్మ దంపతులు పసుపు–కుంకుమ వస్త్రాలు, తాంబూలాలతో సంప్రదాయ పద్ధతిలో మహిళా మంత్రులకు సత్కారం చేశారు. అనంతరం తేనీటి విందు ఏర్పాటు చేసి పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ కార్యక్రమంలో ఎర్రవెల్లి నివాసానికి వచ్చిన మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సాదరంగా ఆహ్వానం పలికారు.





