గత సంవత్సరం కాలంగా రహదారుల పక్కన ఉన్న వ్యవసాయ పొలాల్లోని బోరు బావుల వద్ద ఉన్న సర్వీస్ కేబుల్ వైర్లను దొంగతనం చేసి, అందులోని కాపర్ వైర్లను విక్రయిస్తూ జల్సాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను తొగుట సీఐ షేక్ లతీఫ్, రాయపోల్ ఎస్ఐ కుం
చం మానస ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం అరెస్టు చేసినట్లు గజ్వేల్ ఏసీపీ నర్సింలు తెలిపారు. మంగళవారం రాయపోల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితులను హాజరుపరిచి స్వాధీనం చేసుకున్న దొంగతనపు వస్తువులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ… సిద్దిపేట, మెదక్, మేడ్చల్ జిల్లాలలో వరుసగా జరుగుతున్న బోరు కేబుల్ వైర్ దొంగతనాలు రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయని తెలిపారు.
*12 వరుస దొంగతనాలు – 7 మంది అరెస్ట్*
సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి (4), రాయపోల్ (4), తొగుట (2), మెదక్ జిల్లా చేగుంట (1), మేడ్చల్ జిల్లా షామీర్పేట్ (1) పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 12 వరుస దొంగతనాలకు పాల్పడిన 7 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన ప్రధాన నిందితులు రాయపోల్ మండలం వీరానగర్ గ్రామానికి చెందిన పిట్ల ధనుష్, గజ్వేల్కు చెందిన సత్తు వంశీ, రాంసాగర్ గ్రామానికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్, జగదేవపూర్ మండలం అక్కారం గ్రామానికి చెందిన దూదేకుల సల్మాన్, వీరానగర్ గ్రామానికి చెందిన ఒంక మహిపాల్ సహా ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.
వీరు ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో పరిచయమై, ఆ తర్వాత వేర్వేరు పనులు చేసుకుంటూ గజ్వేల్లోని సత్తు వంశీ నివాసంలో కలుసుకుని మద్యం సేవిస్తూ జల్సాలకు అలవాటు పడ్డారని తెలిపారు. తమ ఆదాయం సరిపోకపోవడంతో దొంగతనాల బాట పట్టారని పోలీసులు తెలిపారు. రాత్రి సమయాల్లో మూడు ద్విచక్ర వాహనాలపై వెళ్లి, రహదారుల పక్కన ఉన్న రైతుల వ్యవసాయ భూముల వద్ద బోరు మోటార్ కేబుల్ వైర్లను కటింగ్ ప్లేయర్లతో కట్ చేసి, అక్కడే కాల్చి కాపర్ తీసి, కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా బద్దిపల్లి ప్రాంతంలోని స్క్రాప్ షాప్లకు విక్రయించేవారని చెప్పారు. రూ.2.80 లక్షల ఆస్తి స్వాధీనం
నిందితుల వద్ద నుంచి 90 కిలోల కాపర్ వైర్ – రూ.70,000. మూడు ద్విచక్ర వాహనాలు – రూ.2,10,000. మొత్తం రూ.2 లక్షల 80 వేల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాపర్ కొనుగోలు చేసిన చిల్లప్ప పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. ఈ కేసును సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్.ఎం. విజయ్కుమార్ పర్యవేక్షణలో, గజ్వేల్ ఏసీపీ నర్సింలు, తొగుట సీఐ షేక్ లతీఫ్, రాయపోల్ ఎస్ఐ మానస ప్రత్యేక బృందాలతో ఛేదించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ దేవయ్య, హెడ్ కానిస్టేబుల్ కనకయ్య, ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.





