అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, సంక్షేమ హాస్టల్లో సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు చేపట్టాలి
జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు.
సిద్దిపేట జిల్లా, జనవరి, తెలుగు న్యూస్ 24/7
అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, సంక్షేమ హాస్టల్లో సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి ముందు ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో సీసీ కెమెరాలు కచ్చితంగా పని చేసే స్థితిలో ఉండాలని అన్నారు. ఇప్పటి వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయని విద్యా సంస్థలలో వెంటనే ఏర్పాటు చేయాలని, ఇప్పటికే సీసీ కెమెరాలు ఉండి పనిచేయని వాటికి వెంటనే రిపేర్లు చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని జిల్లా విద్యాశాఖ అధికారిని మరియు వివిధ గురుకులాల జిల్లా కోఆర్డినేటర్లను ఆదేశించారు. సత్యసాయి సేవా ట్రస్ట్ వారి సహకారంతో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని వైద్య, ఆరోగ్య మరియు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు ఆగేల చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కాలేజీలు, స్కూల్ ల టైములకు ఆర్టీసీ బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలని టిజిఎస్ ఆర్టిసి సిద్దిపేట డిపో మేనేజర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ అబ్దుల్ హమీద్, డిఆర్ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో తదితరులు పాల్గొన్నారు.





