మల్లన్న సాగర్ ముంపు గ్రామాల సమస్యలు తీరేది ఎప్పుడు..?
ఆర్ అండ్ ఆర్ కాలనీ వేముల గట్టు సమస్యలు నెరవేర్చకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం – సర్పంచ్ సిద్దిపేట బాలయ్య
మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన వేముల గట్టు గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని గ్రామాలను ఖాళీ చేయించి ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంతో సర్పంచ్ సిద్దిపేట బాలయ్య ఆధ్వర్యంలో గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అధికారులమాటలు నమ్మి గ్రామాన్ని వదిలిన కుటుంబాలు ఇప్పటికీ అనేక సమస్యలతో సతమతం అవుతున్నాయని, ముంపు గ్రామాల నుంచి నిర్వాసితులను తరలించడంపై శ్రద్ధ చూపిన అధికారులు, ఆ తరువాత వారి సమస్యలను గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు. వేముల గట్టు ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఫ్లాట్స్ ఇస్తామని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాని వాళ్లకు ఇప్పిస్తామన్న అధికారులు, ఇచ్చిన ఫ్లాట్లలో ఇప్పటికీ కేటాయించకపోవడం, ముస్లింలకు ఇచ్చిన ఫ్లాట్లలో కాంపౌండ్ వాల్ కూలగొట్టడం చేస్తున్నారని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి ఇప్పటివరకు ఇండ్లు, ఫ్లాట్స్ కేటాయించని లబ్ధిదారులు కూడా ఉన్నారని, గ్రామం ఖాళీ చేస్తే అన్ని వసతులు కేటాయిస్తామన్న అధికారులు ఇప్పుడు ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మా సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్ష కైనా సిద్ధమని సర్పంచ్ సిద్దిపేట బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఎల్లం, ఆడియాల రంగారెడ్డి, పురుషోత్తం రెడ్డి, నాయిని మల్లారెడ్డి, నాగరాజు, కనకయ్య, పెద్ది బాలకిషన్, ఎర్రన్న గారి శ్రీనివాస్ రెడ్డి, ఎల్లం రెడ్డి, సత్తిరెడ్డి, గ్రామ ప్రజలు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.




