రాజకీయం

రాష్ట్రంలో సింటెక్స్‌ 350 కోట్ల పెట్టుబడులు.. వెయ్యిమందికిపైగా ఉపాధి: మంత్రి కేటీఆర్

87 Views

రాష్ట్రంలో రూ.350 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు మరో పెద్ద కంపెనీ ముందుకొచ్చింది. వాటర్‌ ట్యాంకులు, ప్లాస్టిక్‌ పైపులు, ఆటోకాంపోనెంట్స్‌లో అగ్రగామిగా ఉన్న సింటెక్స్‌ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, తమ సంస్థను విస్తరించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. వెల్‌స్పన్‌ గ్రూప్‌ కంపెనీ భాగస్వామిగా ఉన్న సింటెక్స్‌ తన తయారీ యూనిట్‌ కోసం రూ.350 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నది. ఈ పెట్టుబడి ద్వారా 1,000 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లిలో సింటెక్స్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నది. ఈ తయారీ కేంద్రం నుంచి సింటెక్స్‌ వాటర్‌ ట్యాంకులు, ప్లాస్టిక్‌ పైపులు, ఆటో కాంపోనెంట్స్‌, ఇతర పరికరాలను తయారు చేయబోతున్నది. ఈ కంపెనీ తయారీ ప్లాంట్‌ శంకుస్థాపన కార్యక్రమం ఈ నెల 28న జరుగనున్నది. వెల్‌స్పన్‌ కంపెనీ చైర్మన్‌ బీకే గోయెంకా, మంత్రి కేటీఆర్‌ ఈ కార్యక్రమానికి హజరుకానున్నారు.

సింటెక్స్‌ కంపెనీకి స్వాగతం: కేటీఆర్‌
వెల్‌స్పన్‌ గ్రూప్‌ తెలంగాణలో తన కార్యకలాపాలను మరింత విస్తరించడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. సింటెక్స్‌ కంపెనీకి స్వాగతం పలుకుతూ ట్వీట్‌ చేశారు. సింటెక్స్‌ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన మౌలిక వసతులతో పెట్టుబడులు రాష్ట్రానికి తరలివస్తున్నాయని, ఇదే సమయంలో ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు మరింత విస్తరిస్తున్నాయని వెల్లడించారు. సింటెక్స్‌ కంపెనీకి అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటికే తమ వెల్‌స్పన్‌ గ్రూప్‌ పెద్దఎత్తున పెట్టుబడి పెట్టి విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని, ఇకడి వాతావరణం పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా ఉండటంతో సింటెక్స్‌ ద్వారా మరిన్ని పెట్టుబడులు పెడుతున్నామని కంపెనీ ప్రకటించింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *