సెప్టెంబర్ 16 ఖమ్మం
జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎలాంటి త్యాగానికైనా వెనకాడబోమని, నిరంతర పోరాటాలే తమ సంఘ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ స్పష్టం చేశారు. శుక్రవారం నాడు జిల్లా కేంద్రమైన ఖమ్మంలోని డి.పి.ఆర్.సి సమావేశ మందిరంలో జరిగిన యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పోరాటాలు, త్యాగాల కలయికే టీయూడబ్ల్యూజే సంఘమని విరాహత్ అలీ చెప్పారు. 65 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగివున్న తమ సంఘం నాటి నుండి నేటి వరకు జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, మీడియా స్వేచ్ఛ కోసం రాజీలేని పోరాటాలు చేస్తున్నట్లు ఆయన అన్నారు. జర్నలిస్టు సంఘాల పేరుతో కొందరు కొన్ని దుకాణాలు తెరిచినా, వేలాది జర్నలిస్టులు మాత్రం రాష్ట్రంలో తమ సంఘాన్ని మాత్రమే ఏళ్ల తరబడి విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో జర్నలిస్టులు పొందుతున్న సౌకర్యాలన్నింటినీ ఉమ్మడి రాష్ట్రంలో తమ సంఘం సాధించినవేనన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ పోరాటాలను మరింత ఉధృతం చేసి మరిన్ని సౌకర్యాలు సాధిస్తామని విరాహత్ భరోసానిచ్చారు. ఇంకా ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.రాంనారాయణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వర్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఖాదర్ పాషా, యూనియన్ జిల్లా నాయకులు వెంకట్రావ్, వేణు, పాపారావు, ఆవుల శ్రీనివాస్, మురారీ, శ్రీనివాస్, ఖదీర్, సాగర్, యాకేశ్, హెచ్.యు.జె అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





