శ్రావణపౌర్ణమి నాడే రాఖీ పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా?!
రాఖీపౌర్ణిమ, జంధ్యాలపౌర్ణమిగా పిలుచుకునే శ్రావణ పౌర్ణిమ సోదర సోదరీమణుల ఆత్మీయతకు, అనురాగానికీ ప్రేమకు ప్రతిరూపం. భారతీయ కుటుంబ బంధవ్యాల్లో మధురమైన గుర్తు ఈ పండుగ. వ్యక్తుల మధ్య విడదీయరాని బంధాన్ని ఈ రాఖీ బంధం సృష్టిస్తుంది. సోదర ప్రేమకు చిహ్నంగా ఈ రక్షాబంధనం ప్రసిద్ధ పొందింది. అసలు సంవత్సరంలో ఇన్ని రోజులుండగా అస్సలు ఈ శ్రావణపౌర్ణిమ రోజునే రాఖీపండుగను ఎందుకు జరుపుకుంటున్నామో ఇప్పుడు చూద్దాం.
జ్యోతిష దృక్కోణంలో చూసినపుడు అమావాస్య జ్ఞాన సిద్ధికి ప్రతీక అయితే పౌర్ణిమ కార్యసిద్ధికి ప్రతీక. పౌర్ణిమ రోజున ఉండే నక్షత్రాన్ని బట్టి ఆ పౌర్ణమి ఉండే మాసానికి పేరు ఉంటుంది. అలాగే పౌర్ణమి రోజు శ్రవణం నక్షత్రం ఉండే మాసం శ్రావణ మాసం. శ్రవణం కార్యసాధకం అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. శ్రవణానికి అధిదేవత విష్ణువు. సృష్టి కారకుడు బ్రహ్మ , లయ కారకుడు శివుడు అయితే స్థితి కారకుడై రక్షించేది విష్ణువు. కాబట్టే అలాంటి జగత్ రక్షకుడయిన విష్ణువు అధిదేవతగా గల కార్యసిద్ధిని కలిగించే శ్రవణా నక్షత్రం ఉండే శ్రావణపౌర్ణిమ రోజున మనం రాఖీపౌర్ణిమను జరుపుకుంటాం.
శ్రావణ పౌర్ణమినాడు సోదరీమణులు ఓ పళ్లెంలో రాఖీలు, పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు వంటి ద్రవ్యాలను ఉంచి, ముందుగా కులదైవాన్ని ప్రార్థించి, ఏదైనా తీపి ప్రసాదాన్ని నివేదించాలి. తర్వాత దేవునిముందు రాఖీలను ఉంచి పూజించి అనంతరం ఈ విషయాన్ని మరియు రాఖీలను ఉంచిన పళ్లెమును తీసుకుని వచ్చి, అన్నదమ్ములకు తిలకం దిద్ది, ముఖం తూర్పుగా కూర్చోబెట్టి సోదరీమణులు తమతమ సోదరుల కుడి చేతి మణికట్టుకు రాఖీ రక్షను కట్టాలి.
ఇలా రాఖీ కట్టాక భగవంతునికి నివేదించిన తీపి ప్రసాద సోదరులకు తినిపించాలి. ఆ తర్వాత సోదరులు అక్షింతలు వేసి చెల్లెలైతే దీవిస్తారు. అక్కలైతే నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు.
అందరికి రాఖీ పౌర్ణమి రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు..
