హైదరాబాద్: మరో వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ను ముట్టడిస్తామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఎంపీ లేఖ రాశారు. లక్షల మంది నిరుద్యోగుల అవస్థలు చూడలేకే బహిరంగ లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు.
‘‘కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఏం జరుగుతోంది? నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాగిన ఉద్యమ ఆకాంక్షలు ఎక్కడా నెరవేరలేదు. కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను ఎక్కడికక్కడే వదిలేశారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మర్చారు. అనవసర ఆర్భాటాలకు పోయి ప్రజాధనం వృథా చేస్తున్నారు. తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణలో ఇచ్చిన నోటిఫికేషన్లు, భర్తీ చేసిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ముఖ్యంగా టీచర్ పోస్టుల భర్తీ అంశంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఉపాధ్యాయ పోస్టుల కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు టెట్ రాసి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు.
తెలంగాణలో తొలి టెట్ పరీక్ష 2016 మే 22న జరిగింది. పేపర్-1కు 88,158 మంది హాజరు కాగా 48,278 మంది అర్హత సాధించారు. పేపర్-2ను 2,51,924 మంది రాయగా.. 63,079 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండో టెట్ పరీక్ష 2017 జులై 23న నిర్వహించారు. పేపర్-1ను 98,848 మంది రాయగా.. 56,708 మంది పాసయ్యారు. పేపర్-2కు 2,30,932 మంది హాజరుకాగా.. 45,045 మంది ఉత్తీర్ణులయ్యారు. మూడో టెట్ 2020 జూన్ 12న జరిగింది. పేపర్-1కు 3.18 లక్షల మంది హాజరు కాగా 1,04,578 మంది ఉత్తీర్ణత సాధించారు. పేపర్-2ను 2,50,897 మంది రాయగా.. 1,24,535 మంది పాసయ్యారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 12,500 మంది డీఎడ్, మరో 15,000 మంది బీఎడ్ కోర్సు పూర్తి చేస్తున్నారు. రాష్ట్రంలో వేలల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓవైపు రిటైర్ అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. వారి స్థానాలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది’’ అని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లేఖలో పేర్కొన్నారు.





