హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. భారాస కీలక నేత, మహేశ్వరం మాజీ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరనున్నారు. తన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ అనితారెడ్డితో కలిసి తీగల కృష్ణారెడ్డి హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో తీగల కృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ మేరకు కారు దిగి కాంగ్రెస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.
తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రయాణం ప్రారంభించిన తీగల.. హైదరాబాద్ మేయర్గా పనిచేశారు. అనంతరం హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా) ఛైర్మన్గా పనిచేశారు. హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా పనిచేసిన తీగల 2009లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడినప్పుడు తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డిపై తెదేపా తరఫున పోటీ చేసి గెలుపొందారు. అనంతరం తెరాసలో చేరిన తీగల.. 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి భారాసలో చేరి.. మంత్రి అయ్యారు.
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి మహేశ్వరం జడ్పీటీసీగా గెలిచి రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ అయ్యారు. సబితా ఇంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం నుంచే ఉండటంతో వీరి మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఈ క్రమంలో పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తోందని తీగల అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సిట్టింగ్లకు భారాస టికెట్ వచ్చే అవకాశముందనే సంకేతాలు రావడంతో పార్టీ మారడమే మేలని తీగల భావించినట్టు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలు, పొంగులేటి, జూపల్లి లాంటి కీలక నేతలు హస్తం కండువా కప్పుకోవడంతో అదే దారిలో వెళ్లేందుకు తీగల నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన తాజాగా మాణిక్రావు ఠాక్రే, రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. త్వరలోనే తన కోడలు రంగారెడ్డి జడ్పీ ఛైర్మన్ అనితారెడ్డితో కలిసి తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరనున్నారు.
