హైదరాబాద్: గాంధీ భవన్లో ఆందోళనలు చేస్తే చర్యలు తప్పవని పార్టీ కార్యకర్తలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా పార్టీ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ కొందరు నాయకులు గాంధీభవన్లో ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఇవాళ కూడా గాంధీ భవన్కు రేవంత్ వచ్చేసరికి ఆలేరు నియోజకవర్గం తురకపల్లికి చెందిన కొందరు ఆందోళన చేస్తూ కనిపించారు. వారి వివరాలు తెలుసుకున్న తర్వాత ఆందోళనలపై రేవంత్ తీవ్రంగా స్పందించారు.
ఆలేరు నియోజకవర్గంలో 8 మండలాలకు 7 మండలాల అధ్యక్షులను నియోజకవర్గ ఇంఛార్జి బీర్ల ఐలయ్య, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అనుకూలంగా ఉన్నవారినే నియమించిన విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. ఒక్క మండలం మహిళకు ఇవ్వడాన్ని వ్యతిరేకించడం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే ఆందోళన విరమించకుంటే సస్పెండ్ చేసేందుకు వివరాలు సేకరించాలని గాంధీభవన్ ఇంఛార్జి, పీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్ రావును ఆదేశించారు. అలాగే మొన్నటి వరకు మండల కమిటీ ప్రెసిడెంట్గా ఉన్న శంకర్ నాయక్ను సస్పెండ్ చేయాలని రేవంత్ ఆదేశించారు.
*నిబంధనలు ఉల్లంఘిస్తే సస్పెండే..*
గాంధీ భవన్ మెట్లపై ఇకమీదట ధర్నాలు చేస్తే సస్పెండ్లే ఉంటాయని స్పష్టం చేశారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని పీసీసీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు చిన్నారెడ్డికీ రేవంత్ సూచించారు. అయితే, కమిటీల నియామకంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. పార్టీ ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, వేమ నరేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేయాలని సూచించారు. ఆ వినతులపై పార్టీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.
