Breaking News

మోదీ ఇంటి పేరు’పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసు లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ

101 Views

దిల్లీ: ‘మోదీ ఇంటి పేరు’పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసు లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కి ఇటీవల గుజరాత్‌ హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ కేసులో సెషన్స్‌ కోర్టు విధించిన రెండేళ్ల శిక్షను నిలిపివేయాలంటూ వేసిన స్టే పిటిషన్‌ను గుజరాత్‌ హైకోర్టు కొట్టేసింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ రాహుల్‌ గాంధీ నేడు సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానంలో ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశారు.

 

పరువునష్టం కేసులో సూరత్‌ సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఇటీవల గుజరాత్‌ హైకోర్టు సమర్థించింది. ‘ఈ కేసులో రాహుల్‌ గాంధీకి కిందికోర్టు శిక్ష విధించడం సరైనదే, న్యాయపరమైనదే. ఈ శిక్షను నిలిపివేసేందుకు ఎలాంటి కారణాలు కన్పించడం లేదు. అందుకే పిటిషనర్‌ అభ్యర్థనను కొట్టివేస్తున్నాం’ అని తీర్పు వెలువరించారు. ఇదిలా ఉండగా.. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ఈ పరువునష్టం కేసు నమోదైన విషయం తెలిసిందే.

 

దీనిపై విచారణ చేపట్టిన ట్రయల్‌ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ ఏడాది మార్చిలో తీర్పు వెలువరించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం, పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి.. కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది. దీంతో ట్రయల్‌ కోర్టు తీర్పు వెలువడిన 24 గంటల్లోనే రాహుల్‌పై అనర్హత వేటు వేస్తూ.. లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *