హైదరాబాద్: శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు (బీఎస్రావు) కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం 3.30గంటల సమయంలో హైదరాబాద్లోని ఆయన నివాసంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. బీఎస్ రావు భౌతికకాయాన్ని అపోలో ఆసుపత్రి నుంచి విజయవాడలోని తాడిగడపకు తరలించారు. విజయవాడలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు. బీఎస్ రావు కుమార్తె సీమ విదేశాల్లో ఉన్నారు. ఆమె వచ్చిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఇంగ్లండ్, ఇరాన్లో వైద్యులుగా సేవలందించిన బీఎస్రావు దంపతులు 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను స్థాపించారు. తొలుత విజయవాడలో బాలికల జూనియర్ కళాశాల ప్రారంభించారు. విజయవాడ నుంచి విద్యాసంస్థలను అంచెలంచెలుగా విస్తరించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 321 జూనియర్ కళాశాలలు, 322 టెక్నో స్కూల్స్, 107 సీబీఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి. శ్రీచైతన్య విద్యాసంస్థల్లో దాదాపు 8.5లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
