48 గంటల నిబంధన తూ.చా. తప్పకుండా పాటించాలి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా ,ఫిబ్రవరి 5, 2026:
2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు 48 గంటల నిబంధన ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ ముగిసే 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాలని, సభలు, సమావేశాలు, ర్యాలీలు, మీడియా, ప్రసార సాధనాల ద్వారా ఎలాంటి ప్రచార సంబంధిత అంశాలను కొనసాగించకూడదని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 చట్టంలోని సెక్షన్ 209 ప్రకారం శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదని తెలిపారు. రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, మీడియా యాజమాన్యాలు 48 గంటల నిబంధనను ఖచ్చితంగా పాటించాలని, స్వేచ్ఛాయుత, పారదర్శకమైన ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలని తెలిపారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





