*మంచిర్యాల జిల్లా*
పంట మార్పిడి విధానం ద్వారా అధిక దిగుబడి సాధ్యం. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.
డిసెంబర్ 30, 2025:
వ్యవసాయ సాగులో పంట మార్పిడి విధానం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి ఈ.శంకర్, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, జిల్లా ఉద్యానవన అధికారి అనిత లతో కలిసి డివిజన్, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు, ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు, పశు వైద్య – పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ సాగులో పంట మార్పిడి విధానం అవలంబించడం ద్వారా అధిక దిగుబడి సాధించి ఆర్థిక అభివృద్ధి చెందవచ్చని తెలిపారు. వరి, పత్తి, మొక్కజొన్న పంటలు మాత్రమే కాకుండా వాణిజ్య పంటలు, కూరగాయల సాగు, ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. దేశ వ్యాప్తంగా వరి పంట సాగు విస్తీర్ణం అధిక మొత్తంలో ఉన్నందున రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగుకు అనుకూల ప్రాంతాలను గుర్తించాలని, పంట సాగుతో కలిగే లాభాలపై రైతులకు వివరించి సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. తద్వారా జిల్లాకు నిర్దేశించిన ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపొందుతుందని, రైతులకు ఆర్థికంగా లాభం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో నమోదు అయిన సాగు విస్తీర్ణానికి అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని, జిల్లాలో యూరియా పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి కార్యచరణ ప్రకారం అవసరమైన ప్రతి రైతుకు నిబంధనల ప్రకారం యూరియా అందించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన, పశు వైద్య – పశుసంవర్ధక శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హత గల రైతులకు అందించేందుకు కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





