రేవంత్రెడ్డి పొంకనాల పోశెట్టి.. కేటీఆర్ సెటైర్లు
ఏప్రిల్ 3
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లటం పక్కా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మంగళవారం నాడు మేడ్చల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సభలో కేటీఆర్ పాల్గొని సీఎం రేవంత్రెడ్డి, మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లే మొట్ట మొదటి వ్యక్తి జంపింగ్ జపాంగ్ రేవంత్ రెడ్డే అని ఎద్దేవా చేశారు. ఈ విషయం మీద ఎందుకు రేవంత్ స్పందిచట్లేదని ప్రశ్నించారు.
ఆయన జేబుదొంగ మాదిరిగా జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నారని సెటైర్లు గుప్పించారు. మెడల పేగులు వేసుకొని తిరిగేటోడు ముఖ్యమంత్రా? అని ఎద్దేవా చేశారు. ఆయన ప్రభుత్వాన్ని పడగొడితే మానవబాంబు అవుతాడంటా అని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఆయన పక్కనే నల్గొండ, ఖమ్మం మానవబాంబులే ఆయన్ని కూలగొడుతాయన్ని హెచ్చరించారు. రేవంత్ 5 ఏళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని తాము కోరుకుంటున్నామన్నారు.
దమ్ముంటే రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలనీ నెరవేర్చాలని సవాల్ విసిరారు. రుణమాఫీ చేస్తానన్న పొంకనాల రెడ్డి…రేవంత్ రెడ్డి ఎక్కడ? అని నిలదీశారు. రుణమాఫీ అయినవాళ్లు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేయాలని… మిగతా వాళ్లు బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. మల్కాజ్గిరిలో బీజేపీతోనే బీఆర్ఎస్కు పోటీ అని చెప్పారు. పదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు చేసిందేమిటీ? అని ప్రశ్నించారు.
మాజీమంత్రి ఈటల రాజేందర్ దమ్ముంటే మోదీ మల్కాజ్గిరికి ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని అన్నారు. జై శ్రీరామ్ పేరుతో రాజకీయాలు చేయటమే బీజేపీకి తెలుసని ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేయలేదని మాట్లాడుతున్నందుకు ఈటల రాజేందర్కు సిగ్గు అనిపించట్లేదా అని దెప్పిపొడిచారు. ఏం మొఖం పెట్టుకొని ఎంపీ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు అడుగుతాదో ఈటల చెప్పాలని ప్రశ్నించారు.
