Breaking News

వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలి

91 Views

 

-వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలి::అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

-కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి

-గ్రేడ్ ఏ రకానికి రూ.2203

-గ్రేడ్ బీ రకానికి రూ.2183

-ఏప్రిల్ 1 వ తేదీన మండలానికి ఒక కొనుగోలు కేంద్రం ప్రారంభం

-ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలి

రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాల బాధ్యులు, అధికారులతో సమీక్షలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

సిరిసిల్ల, మార్చి 28, 2024:

జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. రబీ సీజన్ (2023-24) ధాన్యం కొనుగోళ్లపై జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, వివిధ శాఖల అధికారులతో
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని ఆడిటోరియంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ,లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలను అధికారులు, ఆయా శాఖల బాధ్యులు మాత్రమే ప్రారంభించాలని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా టెంట్లు, తాగు నీరు, విద్యుత్ వసతి కల్పించాలని, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం వేసే యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.
ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలని, నిర్దేశించిన విధంగా కొనుగోళ్లు చేయాలని సూచించారు. నిర్దేశించిన బరువుకంటే ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని ఆయన స్పష్టం చేశారు.

-మద్దతు ధరకే విక్రయించాలి
రైతులు తాము కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పిలుపు నిచ్చారు. రైతులు తమ ధాన్యాన్ని తాలు, తప్ప లేకుండా, తేమ శాతం 17 ఉండేలా చూసుకుని,నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూకేంద్రాలకు తరలించాలని సూచించారు. ప్రభుత్వం  గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2203,  గ్రేడ్ బీ రకానికి రూ.2183 నిర్ణయించినందని వెల్లడించారు. నిబంధనల మేరకు రైతులు తమ ధాన్యాన్ని శుభ్రంగా తీసుకువచ్చి, మద్దతు ధర పొందాలని సూచించారు.

-ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం
రబీ సీజన్ కోతలు మొదలైన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 13 మండలాల్లో ఏప్రిల్ 1 వ తేదీన ఒక్కో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తెలిపారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం జిల్లా లో ఈ రబీ సీజన్లో దాదాపు 3 లక్షల నుంచి 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానుందని వెల్లడించారు. ధాన్యాన్ని సేకరించేందుకు పీఏసీఎస్ ఆధ్వర్యంలో 201,  ఐకేపీ ఆధ్వర్యంలో 44, డీసీఎంఎస్
ఆధ్వర్యంలో 10, మెప్మా ఆధ్వర్యంలో4 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు వివరించారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు అన్ని కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అవసరం అయితే ఇంకా కేంద్రాలు ఎక్కువ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రైతులకు టోకెన్లు ఇవ్వాలని, దాని ప్రకారం
కొనుగోళ్లు చేయాలని సూచించారు. ఈ సారి ఐరిస్ యంత్రాలు కూడా పంపిస్తామని, ధాన్యం కొనుగోలు చేసినప్పుడు రైతు ఐరిస్ కూడా తీసుకోవాలని సూచించారు. ఆయా కొనుగోలు కేంద్రాలకు కేటాయించిన రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని, రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖల అధికారులు కొనుగోళ్లు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు.

-అందుబాటులో పరికరాలు
జిల్లాలో అవసరం మేరకు అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ వెల్లడించారు.
టార్పాలిన్లు 8454, తూకం వేసే యంత్రాలు 265, ప్యాడీ క్లీనర్లు 613, తేమ శాతం చూసే మెషిన్లు 570 అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని రైతులు వీటిని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ మద్దతు ధరకే ధాన్యాన్ని విక్రయించాలని అదనపు కలెక్టర్ సూచించారు.

ఈ సమీక్షలో డీసీఎస్ఓ జితేందర్ రెడ్డి, జిల్లా మేనేజర్ జితేంద్ర ప్రసాద్, డీఎంఓ ప్రవీణ్ రెడ్డి, డీఆర్డీఓ శేషాద్రి, డీటీఓ లక్ష్మణ్,  తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7