పెద్దపల్లి జిల్లాలోని రౌడీ షీటర్స్ కు రామగుండం సీపీ ఎం. శ్రీనివాస్ కౌన్సెలింగ్.
సమాజంలో రౌడీగా కాదు..పిల్లలకు మంచి తండ్రిలా ఉండండి .
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మారండి.
ఈరోజు గోదావరిఖని 1 టౌన్ లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జిల్లాలో రౌడీ షీటర్స్ మార్పులో భాగంగా మానవీయ కోణంలో రౌడీ షీటర్స్ మార్పు కోసం కౌన్సిలింగ్ నిర్వహించి ఒక అవకాశం ఇస్తున్నామని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) తెలిపారు.
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ….నేర జీవితం వీడి ప్రస్తుత సమాజంతో మంచి జీవితం గడుపుతూ హుందాగా జీవించాలి అని, నేరస్తులు తొందర పాటులో నేరాలు చేసినా సరే తప్పు చేయని వారి కుటుంబం కూడా దాని వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుందని తెలిపారు. రౌడీ షీటర్స్ తన పిల్లల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని మార్పు తెచ్చుకోవాలని, రౌడీ షీటర్ అనే ఓ పదం తమ బిడ్డల భవిష్యత్ కూడా నాశనం చేస్తుందని గుర్తు చేశారు.మీ పిల్లలకు ఓ మంచి తల్లిదండ్రులుగా ఉండండి. హీరోగా మిగిలిపోండి అని సీపీ తెలిపారు. నేర ప్రవృతి లో మార్పు రాకపోతే చట్టపరంగా చర్యలు కఠినంగా హెచ్చరించారు. ప్రతి ఒక్కరి కదలికలు, చర్యలు మాకు తెలిసిపోతాయాన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా మంచి సత్ప్రవర్తంతో ఉండాలని, ఇలాంటి ప్రలోభాలకు గురై నేరాలకు పాల్పడకుండా,అదేవిదంగా ఎవరైనా నేరాలు పాల్పడినప్పుడు నేరాలు జరగకుండా నియంత్రణలో *క్రైమ్ స్టాఫర్స్* గా ఉండాలని తెలిపారు. భూ కబ్జాలు, ప్రజలను భయపెట్టడం, ఆస్తుల ధ్వంసం వంటి చట్ట విరుద్ధ పనులకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. నేరప్రవృత్తిని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నామని, ఒకవేళ మారకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు. గత పది సంవత్సరాల నుండి ఎలాంటి నేరాలకు పాల్పడకుండా మంచి సత్ప్రవర్తన కలిగి ఉండి పూర్తిగా మారితే రౌడీ షీట్ తొలగించేందుకు కూడా అవకాశం ఉందని సీపీ గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్., గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, గోదావరిఖని, పెద్దపల్లి సబ్ డివిజన్ సీఐ లు, ఎస్ఐ లు పాల్గొన్నారు.
