ఢిల్లీ, పూణెలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు, 2,500 కోట్ల విలువైన మత్తు పదార్థాలు సీజ్
ఢిల్లీ 22 ఫిబ్రవరి
పోలీసు ఉన్నతాధికారుల ఎన్ని కఠిన చట్టాలు అమలు చేస్తున్నా.. సంబంధిత అధికారులు క్షేత్రస్తాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా డ్రగ్స్ సరఫరా మాత్రం ఆగడం లేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా డ్రగ్స్ సరఫరా అవుతోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు సాగిన భారీ ఆపరేషన్ లో పుణె, న్యూఢిల్లీ నగరాల్లో జరిగిన దాడుల్లో రూ.2,500 కోట్లకు పైగా డ్రగ్స్ ను సీజ్ చేశారు. నిషేధిత డ్రగ్ మెఫెడ్రోన్ 1,100 కిలోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుణెలో ముగ్గురు మాదకద్రవ్యాల స్మగ్లర్లను అరెస్టు చేయడంతో పాటు 700 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకోవడంతో ఆపరేషన్ ప్రారంభమైందని పోలీసులు తెలిపారు.
అనంతరం విచారించగా ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో గోడౌన్ లాంటి నిర్మాణాల నుంచి అదనంగా 400 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు
మెఫెడ్రోన్ సరుకును పూణేలో, కుర్కుంభ్ ఎంఐడిసి ప్రాంతంలో నిల్వ చేశారు. మహారాష్ట్రలోని పుణె పోలీసులు స్వాధీనం చేసుకొని అతిపెద్ద మాదకద్రవ్యాల రికవరీగా చెబుతున్నారు.
దేశంలో భారీస్థాయిలో మాదకద్రవ్యాల దందా కొనసాగుతోంది. అయితే కుర్కుంభ్ ఎంఐడీసీకి చెందిన యూనిట్ల నుంచి ఢిల్లీలోని స్టోరేజీ కేంద్రాలకు నిషేధిత మాదకద్రవ్యాలను తరలిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఆపరేషన్ కు సంబంధించి ముగ్గురు కొరియర్లు సహా ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొరియర్ బాయ్స్ పై గతంలో కేసులు నమోదైనట్టు పుణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు.
