అయోధ్యలో శ్రీ రాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో శ్రీ సుదర్శన నారసింహ సహిత విశ్వశాంతి శ్రీ రామాయణ మహా యాగం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.
శనివారం యాగం ఆరంభం సందర్భంగా శ్రీ విశ్వనాథ ఆలయం నుంచి శోభాయాత్ర నిర్వహించారు. ఆలయంలో ఎమ్మెల్యే ఆయన సతీమణి సురేఖ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలశంను యాగశాలకు తీసుకువచ్చారు. విశ్వనాథ ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర వాటర్ ట్యాంక్, మార్కెట్ రోడ్ మీదుగా యాగ స్థలం జడ్పి బాయ్స్ హైస్కూలు క్రీడా స్థలం వరకు కొనసాగింది. శోభాయాత్ర లో మహిళల కోలాటం ఆకట్టుకుంది. వేద పండితుడు నరసింహ శాస్త్రి నేతృత్వంలో పండితులు యాగక్రతువు ప్రారంభించారు.
తొలి రోజు విశ్వక్సేన మహాగణపతి పూజ, పుణ్యాహవచనం యాగం ను నిర్వహించారు.
ప్రేమ్ సాగర్ రావు, సురేఖ దంపతులతో వేదపండితులు యాగం చేయించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాగశాలను దర్శించి ప్రదక్షిణలు చేశారు. అనంతరం సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామిలను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. యాగం సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు.
ఇదేరోజు సాయంత్రం శ్రీ విష్ణు సహ్యస్ర నామ పారాయణం, లలిత పారాయణం, భజన నిర్వహించారు. విశ్వశాంతి, మంచిర్యాల నియోజకవర్గ ములో రామరాజ్య పాలన జరగాలనే సంకల్పంతో యాగం తలపెట్టినట్లు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా యాగం నిర్వహించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.
