గంగుల, శ్రీనివాస్గౌడ్ ఎన్నిక చెల్లవంటూ పిటిషన్లు.. హైకోర్టు కీలక ఆదేశాలు జారీ
హైదరాబాద్: కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లందంటూ తెలంగాణాలో హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు కాగా, ఇవాళ(జులై 31 సోమవారం)దానిపై విచారణ జరిగింది..
ఎన్నికల అఫిడవిట్ లో గంగుల కమలాకర్ తప్పుడు వివరాలు ఇచ్చారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. 2018 ఎన్నికల సమయంలో బండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గంగుల చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు.
అయితే.. గంగుల తప్పుడు వివరాలతో అఫిడవిట్ సమర్పించారంటూ బండి సంజయ్ పిటిషన్ వేశారు. ఈ తరుణంలో ఇవాళ విచారణ జరగ్గా.. పిటిషనర్ను క్రాస్ ఎగ్జామ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది హైకోర్టు. రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి శైలజతో కమిషన్ ఏర్పాటు చేసిన హైకోర్టు.. ఆగస్టు 12 నుండి 17 వరకు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ అగస్ట్ 21కి వాయిదా వేసింది.
ఇక మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనర్హత పిటిషన్పైనా హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల అఫిడవిట్లో శ్రీనివాస్గౌడ్ తప్పుడు ధ్రుృవపత్రాలు సమర్పించారని, శ్రీనివాసగౌడ్ ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదంటూ మహబూబ్నగర్కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి పిటిషన్ వేశాడు. అయితే దీనిని కొట్టేయాలంటూ మంత్రి శ్రీనివాస్గౌడ్ హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా చుక్కెదురైంది. ఈ క్రమంలో..
సోమవారమూ ఈ పిటిషన్పై విచారణ కొనసాగింది. 19-11-2018వ తేదీన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ఆధారంగానే విచారణ జరుపుతోంది ధర్మాసనం. ఈ క్రమంలో.. అఫిడవిట్, ఆధారాలను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్ను ధర్మాసనం ఆదేశించింది. కోర్టు విచారణ పై మీడియాకు ఎలాంటి సమాచారం షేర్ చేసుకోవద్దు వాది, ప్రతివాది ఇద్దరిని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది..





